20వ తేదీ నుండి నవశకం

శ్రీకాకుళం : నవంబరు 15 : రాష్ట్రంలో వై.యస్.ఆర్ నవశకం కార్యక్రమం క్రింద నవంబరు 20 నుండి డిసెంబరు 20వ తేదీ వరకు సంక్షేమ కార్యక్రమాలకు లబ్దిదారుల ఎంపిక జరపాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహానీ అన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శుక్ర వారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ను నిర్వహించారు. నెల రోజుల లబ్దిదారుల ఎంపిక కార్యక్రమాన్ని డ్రైవ్ మోడ్ లో చేపట్టాలని అన్నారు. లబ్దిదారుల ఎంపికకు పథకాల వారీగా మార్గదర్శకాలు విడుదల చేయడం జరుగుతుందని చెప్పారు. ఎంపికైన లబ్దిదారులకు బియ్యం కార్డుతో సహా  వై.యస్.ఆర్ ఆరోగ్య శ్రీ, వై.యస్.ఆర్ పింఛను, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెనకు కొత్త కార్డులు జారీ చేయడం జరుగుతుందని చెప్పారు. ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డులు కొనసాగుతాయని ఆమె చెప్పారు. ఈ కార్డులకు అదనంగా వై.యస్.ఆర్ మత్స్యకార భరోసా, వై.యస్.ఆర్ నేత్ర నేస్తం, జగనన్న అమ్మ ఒడి, కాపు నేస్తం,  దర్జీ, రజక, నాయి బ్రాహ్మణ లబ్దిదారులకు పథకాలు, సున్నా వడ్డీ, ఇమామ్, పాస్టర్ ల పారితోషకం, అర్చకుల వేతనం పెంపు కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందని తెలిపారు.ఎంపిక పక్కగా జరగాలని, డేటా రోజువారీ కంప్యూటరీకరణ చేయాలని ఆమె ఆదేశించారు. ఎం.పిడి.ఓ లు, మునిపల్ కమీషనర్ లు పకడ్బందీగా పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. జాబితాలను గ్రామ సభలలో పెట్టి సోషల్ ఆడిట్ చేయాలని, గ్రామ సభలలో ఎంపిక కార్యక్రమం వివరాలు తెలియజేయాలని అన్నారు. లబ్దిదారుల ఎంపికపై వాలంటీర్లు, సంబంధిత సిబ్బందికి శిక్షణ కల్పించాలని ఇందుకు మండలాల మాస్టర్ ట్రైనర్ లను ఎంపిక చేయాలని అన్నారు. లబ్ధిదారుల ఎంపికలో లబ్ధిదారుల తొలగింపు జరగదని ఆమె స్పష్టం చేస్తూ అర్హులైన మరింతమంది ప్రయోజనం పొందాలనేది ప్రభుత్వ ధ్యేయం అన్నారు. లబ్దిదారుల ఎంపిక కార్యక్రమానికి గృహాలను సక్రమంగా మాపింగ్ చేయాలని సూచించారు. లబ్దిదారుల ఎంపిక ప్రక్రియలో భాగంగా బియ్యం కార్డుకు గ్రామీణ ప్రాంతాల్లో ఆదాయ పరిమితి నెలకు రూ.10 వేలు కాగా, పట్టణ ప్రాంతాల్లో రూ.12 వేలు వరకు ఉంటుందని అన్నారు. పథకాల పరంగా విడుదల చేసే మార్గదర్శకాలలో వివరాలు పూర్తి స్ధాయిలో ఉంటాయని చెప్పారు. లబ్దిదారులు విద్యుత్ నెలకు 3 వందల యూనిట్లు వరకు వినియోగించిన అర్హులేనని, ట్రాక్టర్లు, టాక్సీలు, ఆటోలను కలిగినా కూడా మినహాయింపు ఉందని చెప్పారు. సంబంధిత శాఖల నుండి ముందుగా వివరాలు తీసుకుని లబ్దిదారుల వద్దకు వెళ్లి విచారణ చేసి నిర్దారణ చేస్తారని తెలిపారు. అందరు పారిశుద్ధ్య కార్మికులు అర్హులు  పథకాలకు అర్హులని చెప్పారు. నవ రత్నాల క్రింద అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి లబ్దిదారునికి అందాలని అన్నారు వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టరు నివాస్, జాయింట్ కలెక్టర్ డా. కె. శ్రీనివాసులు, ఐటిడిఏ పిఓ సాయికాంత్ వర్మ,  జిల్లా పరిషత్ సిఇఓ జి.చక్రధర రావు,డిఆర్డీఏ పిడి ఏ.కళ్యాణ చక్రవర్తి,ముఖ్య ప్రణాళిక అధికారి ఎం.మోహన రావు, మత్స్య శాఖ జెడి డా.వివి కృష్ణ మూర్తి, డీపీఓ వి.రవికుమార్, గృహ నిర్మాణ సంస్థ పిడి పి.వేణుగోపాల్, సాంఘిక సంక్షేమ శాఖ డిడి కె.వి.ఆదిత్య లక్ష్మీ, ఆరోగ్య శ్రీ జిల్లా సమన్వయ అధికారి డా.కె. సాయి, ఎస్.సి కార్పొరేషన్ ఇ.డి సి హెచ్ మహా లక్ష్మి, డిటిసి డా.వడ్డి సుందర్, డిఎస్ఓ జి.నాగేశ్వరరావు, ఇపిడిసిఎల్ ఎస్.ఇ ఎన్. రమేష్, డిఇఓ కె. చంద్ర కళ, పశుసంవర్ధక శాఖ జె డి ఏ.ఈశ్వర రావు తదితరులు   పాల్గొన్నారు.