న్యూఢిల్లీ : నవంబరు 8: సేవింగ్ బ్యాంకు ఖాతాదారులకు రిజర్వ్బ్యాంకు ఆఫ్ ఇండియా శుభవార్త చెప్పింది. నెఫ్ట్ సేవలు 2020 జనవరి నుంచి ఉచితంగా అందించాలని నిర్ణయించింది.ఈ లావాదేవీలపై ఎలాంటి చార్జీలను విధించబోమని ఆర్బీఐ శుక్రవారం ప్రకటించింది. తమ నిర్ణయం మేరకు బ్యాంకులు కూడా ఈ ప్రయోజనాన్ని కస్టమర్లకు బదిలీ చేయాలని ఆర్బీఐ కోరింది. సమర్థవంతమైన, సౌకర్యవంతమైన, సురక్షితమైన పేమెంట్ వ్యవస్థలను స్థాపించడం ఆర్బీఐ లక్ష్యమని, ఈ ప్రయత్నాల ఫలితంగా రిటైల్ డిజిటల్ చెల్లింపు వ్యవస్థలు వేగంగా వృద్ధి చెందాయని ఆర్బీఐ ఒక ప్రకటనలో తెలిపింది.అక్టోబర్ 2018వ సంవత్సరం నుండి సెప్టెంబర్ 2019వ సంవత్సరం వరకు మొత్తం నగదు రహిత చెల్లింపుల్లో డిజిటల్ చెల్లింపులు 96శాతంగా ఉన్నాయి. అదే సమయంలో నెఫ్ట్, యుపిఐ వ్యవస్థలు సంవత్సరానికి 252 కోట్లు,874 కోట్ల లావాదేవీలను నమోదు చేశాయి నెఫ్ట్ లావాదేవీలు 20 శాతం యూపీఐ లావాదేవాలు 263శాతం వృద్ధిని సాధించాయని తెలిపింది. ఆర్టీజీఎస్,నెఫ్ట్ ఆర్బీఐ అందిస్తున్న రియల్ టైం పేమెంట్ వ్యవస్థలు. నెఫ్ట్ ద్వారా గరిష్ఠంగా రూ.2 లక్షల వరకు నిధుల బదిలీ చేయవచ్చు.ఆర్టీజీఎస్ పెద్ద మొత్తంలో నిధులను తక్షణమే బదిలీ చేసుకోవచ్చు.
2020వ సంవత్సరం జనవరి నుండి కొన్ని సేవలు ఉచితం : ఆర్.బి.ఐ.