ఇచ్చాపురం : నవంబర్ 28 : జాతి భవిత విద్యార్థుల చేతుల్లోనే ఉందని, దేశ భవిష్యత్ అభివృద్ధికి విద్యార్థులే మూలమని రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పేర్కొన్నారు . గురువారం ఇచ్చాపురం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో వి ఎన్ ఎం పౌండేషన్ దాతృత్వంతో రెండు కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన అదనపు పాఠశాల భవనాన్ని గవర్నర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు ఆహారాన్ని అందిస్తున్నాడని, జవాన్ దేశాన్ని రక్షిస్తున్నాడని, అదే విధంగా విద్యావంతులు విజ్ఞానాన్ని సముపార్జించి దేశాన్ని సాంకేతికంగా అభివృద్ధి చేయాల్సిన ఆవశ్యకత ఉందని వివరించారు. అప్పట్లో జై జవాన్ జై కిసాన్ నినాదం గా ఉండేదని, ప్రస్తుతం వాటితోపాటు జై విజ్ఞాన్ అవసరం ఉందని సూచించారు. దేశంలో కాలుష్యం పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడి పిలుపు మేరకు జల, వాయు , భూ కాలుష్యాలను నివారించి స్వచ్ఛభారత్ గా తీర్చిదిద్దడంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా విజ్ఞానాన్న పెంపొందించడంలో దాతలు ముందుకు రావాలని కోరారు. ఈనెల 26వ తేదీన రాజ్యాంగ దినోత్సవం జరుపుకున్న విషయాన్ని గుర్తు చేసిన గవర్నర్ రాజ్యాంగానికి కట్టుబడి ప్రతి ఒక్కరూ మెలగాలని, రాజ్యాంగంలో పొందుపరచిన హక్కులతో పాటు విలువలు, బాధ్యతలను ప్రతి ఒక్కరు తెలుసుకొని అందుకు అనుగుణంగా నడుచుకోవాలని సూచించారు. భారతీయుడిగా పుట్టినందుకు గర్వపడే విధంగా మనల్ని మనం తీర్చిదిద్దుకోవాలి అని కోరారు.రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలం సురేష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యకు పెద్దపీట వేసిందని, ప్రభుత్వం ఏర్పాటయ్యాక విద్యా పరంగా అనేక సంస్కరణలు చేపట్టడంతో పాటు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని తెలిపారు. నాడు నేడు కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని అన్ని పాఠశాలల స్థితిగతులను రానున్న మూడేళ్లలో పూర్తిగా మారుస్తామని, అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తామని తెలిపారు. జిల్లాలో మూడు వేలకు పైగా పాఠశాలలను ఈ పథకం క్రింద ఆధునికరించవలసి ఉండగా మొదటి దశలో ఈ ఏడాది 1200 పాఠశాలలను ఆధునికరించి మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. అదేవిధంగా ఇచ్చాపురం లోని ఈ ఉన్నత పాఠశాలకు కూడా 80 లక్షల రూపాయలు మంజూరు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. విద్యకు పేదరికం అడ్డురాకూడదన్న నాటి ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి స్ఫూర్తితో ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతి పేదవాడికి విజ్ఞానాన్ని అందించి, ఉన్నతంగా తీర్చిదిద్దడానికి ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టినట్లు వివరించారు. దీంతో యావత్ భారతదేశం ఆంధ్ర ప్రదేశ్ వైపు దృష్టి సారించిందని, భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు అత్యుత్తమ స్థానాలు సాధిస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు.
జిల్లా కలెక్టర్ జె. నివాస్ మాట్లాడుతూ తాను చదువుకున్న పాఠశాల బాగు పడాలన్న సదుద్దేశంతో వి ఎన్ ఎం పౌండేషన్ అధినేత వెంకటేష్ రెండు కోట్ల రూపాయలతో పాఠశాల భవనాలను నిర్మించి అందించడం సంతోషకరమని, అదే స్ఫూర్తితో. మరింత మంది దాతలు ముందుకు రావాలని కోరారు. అన్ని దానాల కన్నా విద్యా దానం గొప్పదన్నారు.
వి ఎన్ ఎం ఫౌండేషన్ చైర్మన్ వజ్రపు వెంకటేష్ మాట్లాడుతూ నాన్నమ్మకు ఇచ్చిన మాట ప్రకారం మా బడి రుణం మా గ్రామం రుణం తీర్చుకునే అవకాశం కలిగిందని అందుకు చాలా సంతోషిస్తున్నాను అని తెలిపారు. 1956 లో సురంగి రాజా సహకారంతో నిర్మించిన భవనాన్ని అప్పటి గవర్నర్ తివారీ ప్రారంభించగా, ప్రస్తుతం మేం నిర్మించిన భవనాన్ని ప్రస్తుత గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ చేతుల మీదగా ప్రారంభించడం ఆనందదాయకం అన్నారు. ఈపాఠశాలలో చదువుకతున్న విద్యార్థులు పాఠశాల అభివృద్ధికి కృషి చేయటంతోపాటు మా గ్రామ కీర్తిని, ప్రతిష్టను పెంపొందించాలని కోరారు.
జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభమైన ఈ కార్యక్రమం అనంతరం వి ఎన్ ఎం ఫాండేషన్, విద్యా శాఖల ఆధ్వర్యంలో గవర్నర్ కు జ్ఞాపికలను బహుకరించి ఘనంగా సత్కరించారు. అదేవిధంగా రూ.2కోట్లతో పాఠశాల భవనాన్ని నిర్మించిన ఫాండషన్ చైర్మన్ వెంకటేష్ వారి దాతృత్వాన్ని అభినందిస్తూ గవర్నర్ , విద్యాశాఖ మంత్రి దుశ్శాలువతో సన్మానించారు.ఈ కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్, కే శ్రీనివాసులు, టెక్కలి ఆర్డీవో ఈట్ల కిషోర్, విద్యాశాఖ ప్రాంతీయ సంయుక్త సంచాలకులు కె. నాగేశ్వరరావు, జిల్లా విద్యాశాఖ అధికారి కె. చంద్రకళ, వి ఎన్ ఎం పౌండేషన్ కుటుంబ సభ్యులు వజ్రపు శంకరలక్ష్మి, అనూష, ఇతర కుటుంబ సభ్యులు, పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
దేశ భవిష్యత్ అభివృద్ధికి విద్యార్థులే మూలం : రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ .