జిల్లాలో నాడు-నేడు ప్రారంభించిన ఇన్ చార్జ్ మంత్రి : నాని

శ్రీకాకుళం : నవంబరు 14 : ప్రపంచీకరణలో ఆంగ్ల భాష అవసరమని జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వర రావు అన్నారు. రాష్ట్ర  ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాడు – నేడు కార్యక్రమాన్ని బాలల దినోత్సవం సందర్భంగా రాజాం మండలం పొగిరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రాష్ట్ర రహదారులు, భవనాల శాఖా మంత్రి ధర్మాన క్రిష్ణదాస్ తో కలసి ఇన్ ఛార్జ్ మంత్రి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో  భాగంగా ఏపి సాంఘిక సంక్షేమ గురుకులం ఆధ్వర్యంలో ఐఐటి, జెఇఇ, నీట్ పరీక్షలకు  సూపర్ 60 బ్యాచ్ శిక్షణను మంత్రి ప్రారంభించారు. జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు (నాని) మాట్లాడుతూ స్వాతంత్ర్య వచ్చి 70 ఏళ్ళు అయినా పాఠశాలలకు మౌళిక సదుపాయాల కొరత ఇంకా  ఉందన్నారు. అందుకే ప్రభుత్వం రాష్ట్రంలో 45 వేల పాఠశాలలకు మౌళిక సదుపాయాలు కల్పనకు 33 వేల కోట్ల రూపాయలు  కేటాయింపు జరిపిందన్నారు. ఇందులో మొదటి దశ కార్యక్రమంలో 15,715 పాఠశాలల్లో ఫ్యాన్లు, ట్యూబ్ లైట్లు, మరుగుదొడ్లు, ఫర్నీచర్, ప్రహారీ గోడలు, తరగతి గదులకు పెయింటింగులు, మరమ్మతులు, ఫినిషింగులు, బ్లాక్ బోర్డుల ఏర్పాటు, రక్షిత తాగు నీరు, ఇంగ్లీషు లాబ్ ల సదుపాయం కల్పించడం జరుగుతుందని చెప్పారు. పునాధి స్థాయి నుండి ప్రామాణిక విద్య అందించాలని ముఖ్యమంత్రి ప్రజా సంకల్ప యాత్రలోనే నిర్ణయించారని చెప్పారు.పాఠశాలల్లో బోధనా ప్రమాణాలు పెంచడంతోపాటు ఉపాధ్యాయులకు అవసరమైన శిక్షణ అందించడం జరుగుతుందని చెప్పారు. సకాలంలో విద్యార్ధులకు పుస్తకాలు,బూట్లు, యూనిఫారాలు అందించడం., మద్యాహ్న భోజనం నాణ్యత పెంచడం,విద్యార్ధుల్లో నైపుణ్యాలు పెంపొందించడం వంటి అంశాలపై ప్రత్యేక శ్రద్ధ వహించడం జరుగుతోందని చెప్పారు. వై.యస్.ఆర్ ఫీజ్ రీయింబర్స్మెంట్ తో పేద విద్యార్థులు చదువులకు శ్రీకారం చుట్టగా, అతని తనయుడు జగన్ మోహన్ రెడ్డి మరిన్ని సౌకర్యాలు కల్పించాలని నిర్ణయించారని వివరించారు.బడుగు బలహీన, పేద వర్గాల విద్యార్థులను ఇంగ్లీషు మీడియంలో చదివించడానికి ముఖ్య మంత్రి సంకల్పించారని పేర్కొన్నారు. ఉన్నత స్థాయిలో ఉన్న కుటుంబాలు ఎక్కువగా ఇంగ్లీషు మీడియంలో చదివిస్తున్నారని ఈ సందర్భంగా మంత్రి అన్నారు. ప్రపంచీకరణలో ఇంగ్లీషు అవసరం ఎంతో ఉందని అన్నారు. ప్రామాణికమైన చదువులకు ఇంగ్లీషు ఆవశ్యకతను ఎవరూ కాదనలేరని అన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుండి 6వ తరగతి వరకు ఇంగ్లీషు మీడియంలో విద్యా బోధన జరుగుతుందని మంత్రి స్పష్టం చేసారు. దశల వారీగా రాబోయే నాలుగేళ్లలో 10వ తరగతి వరకు ఇంగ్లీషు మీడియంలో బోధన జరుగుతుందని చెప్పారు. అయితే తెలుగు భాషను తప్పనిసరిగా బోధించడం జరుగుతుందని ఆయన అన్నారు. ఇన్ ఛార్జ్ మంత్రిగా శ్రీకాకుళం జిల్లాకు నియమించినందుకు ముఖ్య మంత్రికి ధన్యవాదాలు చెప్పారు. రాష్ట్ర రహదారులు, భవనాల శాఖా మంత్రి ధర్మాన క్రిష్ణ దాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో అత్యంత ప్రాధాన్యత అంశంగా విద్యను ముఖ్యమంత్రి పరిగణించారన్నారు. విద్యా ప్రమాణాలు బాగా పెరగాలని ముఖ్యమంత్రి ఆశయం అన్నారు. దేశ ప్రధమ ప్రధాని  జవహర్ లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా నాడు -నేడు కార్యక్రమం  ప్రారంభించారని పేర్కొంటూ చిన్నారులు అంటే నెహ్రూకు ప్రేమ అని ఆయన స్పూర్తితో ప్రతీ చిన్నారి చదవాలని, ఉన్నత స్ధాయికి ఎదగాలని అన్నారు. పాఠశాలల్లో పూర్తి స్థాయిలో వసతుల కల్పనకు నాడు – నేడు కార్యక్రమం ప్రారంభించడం జరిగిందన్నారు. ఆంగ్ల విద్యతో విద్యార్థుల జీవితం బాగుపడాలని ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టడం జరిగిందన్నారు.
మాతృభాషను నిర్లక్ష్యం చేయాలనేది ఉద్దేశ్యం కాదని మంత్రి స్పష్టం చేసారు. పాఠశాలలకు పిల్లలను పంపించే తల్లులకు అమ్మ ఒడి క్రింద రూ.15 వేలు అందించడం జరుగుతుందని ఆయన చెప్పారు.రాజాం శాసన సభ్యులు కంబాల జోగులు మాట్లాడుతూ ప్రజా సంకల్ప యాత్రలో చూసిన కష్టాలను పరిష్కరించుటకు ముఖ్యమంత్రి చర్యలు చేపట్టారన్నారు. ఇందులో భాగంగా పాఠశాలల్లో వసతుల కల్పన జరుగుతోందని పేర్కొన్నారు. చదువుకోవడం వలన అన్ని విధాలా అభివృద్ధికి అవకాశాలు ఉంటాయని చెప్పారు.జిల్లా కలెక్టర్ జె నివాస్ మాట్లాడుతూ పాఠశాలలకు మౌళిక సదుపాయాలు కలగడం  చారిత్రాత్మకం అన్నారు. నాడు – నేడు కార్యక్రమం క్రింద చేపట్టే పనులను పాఠశాల విద్యా కమిటీ నిర్వహిస్తుందన్నారు. ప్రభుత్వ నమ్మకాన్ని విద్యా కమిటిలు నిలబెట్టుకోవాలని, నాణ్యమైన నిర్మాణాలు చేపట్టాలని అన్నారు. జిల్లాలో 1261 పాఠశాలకు అన్ని మౌళిక సదుపాయాల పనులు మొదటి దశలో చేసే అవకాశం కలిగిందన్నారు.తాగునీరు, మరుగుదొడ్లు, నల్లబల్ల, తరగతి గదులు, కుర్చీలు, బెంచీలు, ఇంగ్లీషు లాబ్, ప్రహారీ గోడ తదితర సౌకర్యాలు వస్తాయని పేర్కొన్నారు. సాంఘిక సంక్షేమ శాఖ గురుకులంలో ఐఐటి, నీట్ పరీక్షలు రాయుటకు సూపర్60 బ్యాచ్ కు శిక్షణ శ్రీకారం చుట్టడం జరిగిందని చెప్పారు. జిల్లాలో వసతి గృహాలను పర్యవేక్షణ చేయాలని ముఖ్య మంత్రి సూచన చేసారని అందులో భాగంగా వసతి గృహాలకు అవసరమగు సదుపాయాల కల్పనకు రూ.11.34 కోట్లు వెచ్చిస్తున్నామని తెలిపారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పిల్లలు అందరిని చదివించడం మాత్రమే కాకుండా విలువలతో కూడిన విద్య అందించాలి, నేర్పాలని కోరారు.జిల్లా విద్యాశాఖ అధికారి కె. చంద్రకళ మాట్లాడుతూ జిల్లాలో 3291 పాఠశాలలు ఉండగా 1261 పాఠశాలలను నాడు- నేడు కార్యక్రమంలో మౌళిక సదుపాయాలు కల్పన జరుగుతుందన్నారు. ఇందులో 739 ప్రాధమిక, 342 అప్పర్ ప్రైమరీ 180 ఉన్నత పాఠశాలలు ఉన్నాయని చెప్పారు. పాఠశాలల విద్యా కమిటీలు అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని కోరారు.8వ తరగతి విద్యార్థులు సాయి మాట్లాడుతూ మౌళిక సదుపాయాలు కల్పిస్తున్నందుకు ముఖ్య మంత్రి  ధన్యవాదాలు తెలియజేయగా, శరణ్య మాట్లాడుతూ పాఠశాలకు ప్రహారీ గోడను నిర్మించారని ధన్యవాదాలు తెలిపింది.
ఈ కార్యక్రమంలో పాలకొండ ఆర్డీవో టివిఎస్ జి కుమార్, నియోజకవర్గ ప్రత్యేక అధికారి బి.శాంతి,  గురుకులం జిల్లా సమన్వయ అధికారి వై. యశోదా లక్ష్మి, రాజాం మండల ప్రత్యేక అధికారి డా.జగన్నాధ రావు., పిరియా సాయి రాజ్, తమ్మినేని చిరంజీవి నాగ్, ఎస్.వి.రమణ, రాజు, ఉపాద్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.