మీరూ బతకండి.. సంస్థనూ బతికించండి’

హైదరాబాదు : నవంబరు 29 : తీవ్ర నిరాశా నిస్పృహలు, ఆవేదన గూడు కట్టుకున్న ఆర్టీసీ కార్మికులకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎట్టకేలకు తీపి కబురు చెప్పారు. బేషరతుగా ఉద్యోగాల్లో చేరవచ్చని స్పష్టం చేశారు.శుక్రవారం ఉదయం మొదటి గంటలోనే ఎవరి ఉద్యోగంలో వారు చేరి మంచిగా బతకాలని ఆకాంక్షించారు. ప్రభుత్వం తలచుకుంటే సమ్మెను లేబర్‌ కోర్టుకు పంపగలదని, అలా చేస్తే కార్మికుల ఉద్యోగాలు ఊడతాయని, కానీ తాము అలా చేయడం లేదని ఊరటనిచ్చారు. ఆర్టీసీ మనుగడకు తక్షణమే రూ.100 కోట్లు ఇస్తున్నానని కూడా ప్రకటించారు. సమ్మె కాలంలో చనిపోయిన కార్మికుల కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు.అయితే, ఆర్టీసీ మనుగడ పేరిట చార్జీలను కిలోమీటరుకు ఏకంగా 20 పైసల చొప్పున పెంచేశారు. సోమవారం నుంచే పెంచిన చార్జీలు అమల్లోకి వస్తాయని ప్రకటించారు. సమ్మె కాలంలో తాత్కాలికంగా పనిచేసిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఆర్టీసీ కార్మికులు బెదిరించినా, అవమానించినా భరిస్తూ కష్టకాలంలో పని చేశారని, భవిష్యత్తులో తప్పకుండా మీ గురించి ప్రభుత్వం ఆలోచన చేస్తుందని హామీ ఇచ్చారు. సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన గురువారం ప్రగతి భవన్లో రాష్ట్ర కేబినెట్‌ సమావేశం జరిగింది. అనంతరం మంత్రులతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ''కేబినెట్‌లో మంత్రులు నాతో చెప్పిండ్రు. మనం ఎన్నో సంస్థలను కాపాడినాము. ఎంతో మందికి అన్నం పెట్టినం. వీళ్లను బజార్ల పడేసి మనం చేసేది ఏం ఉంటది. ఒక్క చాన్స్‌ ఇచ్చి చూద్దాం. బతుకుతే బతుకుతరు. చస్తే చస్తరు. మనమైతే అవకాశం ఇవ్వాలని చెప్పిండ్రు. రాష్ట్ర ప్రభుత్వం పక్షాన ఆర్టీసీ పక్షాన కార్మికులకు చెబుతున్నా ఇప్పటికైనా మీరు రియలైజ్‌ కండి. ఇప్పుడే ఆర్టీసీకి ఆదేశాలు ఇస్తాం. అందరికందరూ పొద్దుగాల డ్యూటీల్లో జాయిన్‌ అవ్వండి. మీ ఉద్యోగాలు కాపాడుకోండి. మంచిగ బతకండి'' అని పిలుపునిచ్చారు.మిమ్మల్ని చేర్చుకోవాలని ఐదు నిమిషాల్లో ఆర్టీసీకి ఉత్తర్వులు ఇస్తామన్నారు. మీరు బతకాలని, మీ సంస్థ బతకాలని కోరుకుంటున్నామని, మీరు మా బిడ్డలని చెప్పానని, అలాగే చూసుకుంటున్నానని చెప్పారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో కార్మికుల పొట్టలు నింపామని, అంతే తప్పితే ఎవరి కడుపు కొట్టలేదని సీఎం కేసీఆర్‌ అన్నారు. ''ఆశా వర్కర్లకు, హోం గార్డులకు ఇలా చాలా మందికి ఎక్కువ వేతనం ఇస్తున్నది దేశవ్యాప్తంగా కేవలం తెలంగాణలోనే. ట్రాఫిక్‌ పోలీసులకు 30 శాతం రిస్క్‌ అలవెన్సు ఇస్తున్నాం. ఇండియాలో తెలంగాణ ఒక్కటే దీనిని ఇస్తోంది.ఒంటరి మహిళలకు పింఛను ఇచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణ. దేశవ్యాప్తంగా 16 రాష్ట్రాల్లో బీడీ కార్మికులు ఉన్నారు. ఏ ఒక్క రాష్ట్రంలో కూడా వారికి పింఛను ఇస్తలేరు. ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం గుజరాత్‌లోనూ ఇవ్వడం లేదు'' అని వివరించారు. యూనియన్ల మాటలు నమ్మి కార్మికులు పెడదారి పట్టారని, సంస్థను దెబ్బతీసుకున్నారని, వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని కేసీఆర్‌ మండిపడ్డారు.