ప్రజల జీవన ప్రమాణం పెరగాలి

శ్రీకాకుళం : నవంబరు 27 : వి.ఎం.ఆర్.డి.ఎ.ద్వారా రూపొందించనున్న ఖచ్చితమైన ప్రణాళిక ద్వారా జిల్లా ప్రజల జీవన ప్రమాణాల స్థాయి పెరగాలని జిల్లా కలెక్టర్ జె.నివాస్ తెలిపారు. బుధవారం విశాఖ మెట్రోపాలిటిన్ రీజియన్ డెవలెప్ మెంట్ ప్రిపరేషన్ ఆఫ్ పెర్స్పెక్టివ్ ప్లాన్ ఫర్ 2051 పై జరిగిన స్టేక్హోల్డర్స్ వర్క్ షాపు  కార్యక్రమానికి  జిల్లా  కలెక్టర్ విచ్చేసారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో సుదీర్ఘమైన సముద్ర తీర ప్రాంతం వుందని,ప్రముఖ దేవాలయాలు వున్నాయని, వనరులకు కొదవ లేదని తెలిపారు అదే విధంగా బౌధ్ధ ఆరామాలు, ప్రాచీన చారిత్రక కట్టడాలు కూడా వున్నాయని చెప్పారు.పెర్సపెక్టివ్ ప్లాన్ లో జిల్లా అభివృధ్ధి కోసం రూపొందించవలసిన  అంశాలను వివరించారు.  జిల్లాలో హెరిటేజ్ టూరిజాన్ని అభివృధ్ధి పరచాలన్నారు. సముద్రతీర ప్రాంత అభివృధ్ధికి ప్రణాళికలు రూపొందించాలన్నారు.  నదీపరీవాహక ప్రాంతాలను అభివృధ్ధి పరచాలన్నారు. పొందూరు ఖాదీ పరిశ్రమలను అభివృధ్ధి పరచాలని,రాజాం పట్టణ రహదారులను విస్తరింపచేయాలని తెలిపారు. రాబోయే 30 సంవత్సరాలను దృష్టిలో పెట్టుకుని జాతీయ రహదారి విస్తరణను చేపట్టాలని చెప్పారు.  నరసన్నపేట, సోంపేట, టెక్కలి, రణస్థలం మున్సిపాలిటీలుగా రూపొందనున్నాయన్నారు. అండర్ గ్రౌండ్  డ్రైనేజీ నిర్మించవలసిన ఆవశ్యకతను వివరించారు. ముందుగా  విఎంఆర్ డిఎ  చీఫ్ అర్బన్ ప్లానర్ బి.సురేష్ మాట్లాడుతూ, విఎంఆర్ డిఎ  ప్లాన్ 2021 సం.తో ముగియనున్నదని తెలిపారు. 2041 సం.నికి మాస్టర్ ప్లాన్, 2051 కి పెర్స్పెక్టి రూపొందించనున్నట్లు తెలిపారు. ఇందులో ప్రజలకు నాణ్యమైన జీవన విధానం, పచ్చదనం పరిశుభ్రతతో కూడిన వాతావరణం అందించే దిశగా  ప్రణాళికలు రూపొందించనున్నామని తెలిపారు.  శ్రీకాకుళం జిల్లాలో 11 మండలాలు సుడా (శ్రీకాకుళం అర్బన్ డెవలెప్ మెంట్ అథారిటీ)  పరిధిలోకి వస్తాయని , రాబోయే 30 సం.ల భవిష్యత్ ననుసరించి జనాభా, ఉపాధి, ఉద్యోగ, ఆర్ధిక  అవసరాలకు అనుగణంగా పెర్స్పెక్టివ్ ప్లాన్  తయారు చేయనున్నామని తెలిపారు. జిల్లా అభివృధ్ధికోసం పెర్స్పెక్టివ్ ప్లాన్ లో రూపొందించవలసిన అంశాలపై ప్రభుత్వ శాఖాధికారులంతా వారి సలహాలు, సూచనలు అందించాలని తెలిపారు.  ముందుగా పై పవర్ పాయంట్ ప్రెజెంటేషన్ ద్వారా అభివృధ్ధి పనులపై వివరించారు.ఈ కార్యక్రమానికి  సంయుక్త కలెక్టర్ కె.శ్రీనివాసులు, నగరపాలక సంస్థ కమీషనరు ఎం.గీతాదేవి, జిల్లా పరిషత్ సి.ఇ.ఓ.జి.చక్రధరరావు, ముఖ్యప్రణాళికాధికారి ఎం.మోహనరావు మత్స్యశాఖ సంయుక్త సంచాలకులు వి.కృష్ణమూర్తి, ఆర్.అండ్.బి.  ఎస్.ఇ.కాంతిమతి,  డి.పి.ఓ. వి.రవి కుమార్,   ఆర్.డబ్ల్య్.ఎస్. ఎస్.ఇ. శ్రీనివాసరావు, జి.ఎం. ఇండస్ట్రీస్ గోపాల కృష్ణ, జిల్లా పర్యాటక అధికారి ఎన్.నారాయణ రావు టౌన్ ప్లానింగ్ అధికారులు, వి.ఎం.ఆర్.డిఎ. కన్సెల్టెంట్ రమేష్, తదితర అధికారులు హాజరైనారు.