నవరత్నాల- పేదలందరికీ ఇల్లు : మంత్రి పిల్లి

నెల్లూరు : 'నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు' అనే వెబ్‌సైట్‌ను శనివారం నగరంలోని జిల్లాపరిషత్‌ కార్యాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో మంత్రులు పిల్లి సుభాష్‌చంద్రబోస్‌, రంగనాథ్‌రాజు, అనిల్‌కుమార్‌లు ప్రారంభించారు. అందరికీ ఇళ్లు పథకంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోని పథకం ప్రగతిని ఒకే వేదికపై తెలుసుకునేలా జిల్లా కలెక్టర్‌ శేషగిరిబాబు, జేసీ వినోద్‌కుమార్‌ల పర్యవేక్షణలో ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో వెబ్‌సైట్‌ను రూపొందించారు. ఈ వెబ్‌సైట్‌ పనితీరును కావలి సబ్‌కలెక్టర్‌ శ్రీధర్‌ పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా తెలియజేశారు. వెబ్‌సైట్‌ రూపకల్పనకు కృషిచేసిన రెవెన్యూ యంత్రాంగాన్ని, ప్రత్యేకంగా కలెక్టర్‌ శేషగిరిబాబు, జేసీ వినోద్‌కుమార్‌, డీఆర్‌వో మల్లికార్జున, కావలి సబ్‌కలెక్టర్‌లను పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ అభినందించారు.ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన పథకం అమల్లో భాగంగా విశేషంగా కృషిచేసిన జిల్లా గృహనిర్మాణశాఖ డీఈ నరసింహం, ఏఈ రమణయ్యలకు కేంద్ర ప్రభుతం ఈనెల 19న దిల్లీలో అవార్డులు ప్రధానం చేయడం జరిగింది.ఈ సందర్భంగా వారిద్దర్నీ మంత్రులు పిల్లి సుభాష్‌చంద్రబోస్‌, రంగనాథ్‌రాజు, అనిల్‌కుమార్‌ యాదవ్‌ శాలువాలతో సత్కరించి, అభినందించారు.