శ్రీకాకుళం : డిశంబరు 27 : ప్రకృతి విపత్తులు సంభవించినపుడు తక్షణమే స్పందించుట వలన ప్రాణనష్టం, ఆస్తి నష్టం తగ్గించవచ్చని జిల్లా రెవెన్యూ అధికారి బలివాడ దయానిధి అన్నారు. విపత్తు స్పందన విధానం పై జడ్పీ సమావేశ మందిరంలో ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో రెండురోజుల కార్యశాల, శిక్షణ కార్యక్రమాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లాలో సుదీర్ఘ తీరప్రాంతం ఉందని, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినపుడు నష్టం ఎక్కువగా ఉంటుందన్నారు. ఈ నష్టాన్ని తగ్గించేందుకు ముందస్తు చర్యలు, తక్షణ స్పందన ఎంతో ముఖ్యమైనదని తెలిపారు. తక్షణ స్పందనలో సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి ప్రజలను అప్రమత్తం చేయవచ్చన్నారు. గతంలో హామ్ రేడియో ప్రముఖంగా వినియోగించేవారని తెలిపారు. విపత్తు స్పందన, సత్వర హెచ్చరిక పై నిర్వహిస్తున్న రెండురోజుల కార్యశాల, శిక్షణ ఉపయోగకరమైనదని చెప్పారు. మానవ వనరుల అభివృద్ధి సంస్థ రాష్ట్ర సంచాలకులు సుబ్బారావు మాట్లాడుతూ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ, యునైటెడ్ నేషన్స్ డిజాస్టర్ ప్రోగ్రామ్ లతో తమ సంస్థ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటుచేసిందని, ఇందులో పోలీసు, పశు సంవర్థక, వ్యవసాయ, మునిసిపల్ పరిపాలన, ప్లానింగ్, హౌసింగ్ తదితర ప్రభుత్వ శాఖల ఉద్యోగులు రెండు రోజుల శిక్షణలో పాల్గొంటున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో మానవ వనరుల సంస్థ శిక్షణ సమన్వయకర్తలు కార్తీక్, రవి, ప్రభుత్వ సిబ్బంది పాల్గొన్నారు.
విపత్తుల్లో తక్షణ స్పందన అవసరం.