వర్షం కారణంగా తొలి టి20 రద్దు

గువాహటి: బర్సపర స్టేడియం వేదికగా టీమిండియా X శ్రీలంక జట్ల మధ్య జరగాల్సిన తొలి టీ20 వర్షం కారణంగా రద్దయింది. మ్యాచ్‌ 7 గంటలకు ప్రారంభంకావాల్సి ఉండగా 6:30 గంటలకే టాస్‌ వేశారు. టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకోగా.. మ్యాచ్‌కు కాసేపటి ముందే వర్షం ప్రారంభమైంది. అరగంటకు పైగా ఏకధాటిగా వర్షం కురవడంతో పిచ్‌ తడిసిపోయింది. మైదానం సిబ్బంది తేమ తొలగించేందుకు ఎన్ని ప్రయత్నాలూ చేసినా పరిస్థితిలో మార్పు కనపడలేదు. మూడు సార్లు అంపైర్లు పిచ్‌ను పరిశీలించిన తర్వాత మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. రెండో టీ20 ఇండోర్‌ వేదికగా మంగళవారం జరగనుంది. మూడో మ్యాచ్‌కు జనవరి 10న పుణె వేదిక కానుంది.