ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు శుభవార్త

ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరో బంపర్ ఆఫర్ ఇచ్చారు. గతంలో గ్రామ సచివాలయ ఉద్యోగాలు భర్తీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం మరోసారి గ్రామ సెక్రటేరియట్ ఉద్యోగాల భర్తీకి ప్రక్రియ ప్రారంభించనుంది. ఈ మేరకు సీఎం జగన్ మోహన్ రెడ్డి పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పంచాయతీరాజ్,  గ్రామీణాభివృద్దిపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సమీక్ష నిర్వహించారు. పంచాయతీరాజ్‌శాఖ మంత్రి పెద్దిరెడ్డి సహా అధికారులు హాజరయ్యారు. ఉపాధిహామీ పనులు, గ్రామసచివాలయాలు,  రైతు భరోసాకేంద్రాలు, నాడు– నేడు కింద స్కూళ్లలో ప్రహరీ గోడల నిర్మాణం, వాటర్‌గ్రిడ్‌ అంశాలపై సీఎం జగన్ సమీక్ష చేశారు.
కొత్తగా మరో 300 గ్రామ సచివాలయాలు నిర్మించాలి. అందులో మరో 3000 మందికి పైగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. సచివాలయాల్లో ప్రస్తుతం ఖాళీగా ఉన్న 15,971 ఉద్యోగాలు భర్తీ చేయాలి’ సీఎం జగన్ ఆదేశించారు. గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలను వీలైనంత త్వరగా పూర్తిచేయాలని సీఎం జగన్ స్పష్టం చేశారు. తర్వాత మినీ గోడౌన్ల నిర్మాణంపైనా దృష్టిపెట్టాలన్నారు.ఫిబ్రవరి నుంచి ఇంటివద్దకే పెన్షన్లు అందించాలని సీఎం జగన్ ఆదేశించారు. వాలంటీర్ల ద్వారా లబ్ధిదారులకు చేరవేయాలన్నారు. పెన్షన్లకోసం ఎదురుచూపులు, వేచి చూసే పరిస్థితి లేకుండా చేయడానికే ఈ చర్యలు చేపట్టామని చెప్పారు. సర్వేలతో ముడిపెట్టి ఇళ్లపట్టాలను నిరాకరించవద్దని అధికారులకు సీఎం జగన్ స్పష్టం చేశారు. షేత్రస్థాయిలో పరిశీలన చేసి ఆమేరకు లబ్ధి దారులను గుర్తించాలని సూచించారు. అర్హులైన వ్యక్తులు ఎంతమంది ఉన్నా పట్టాలు ఇవ్వాల్సిందేనని తేల్చి చెప్పారు.