శ్రీకాకుళం : శతశాతం మరగుదొడ్లు వినియోగించుకోవడం ద్వారా మాత్రమే ఆరోగ్యకర సమాజం ఏర్పడుతుందని జిల్లా కలెక్టర్ జె.నివాస్ పేర్కొన్నారు. బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో స్వఛ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా ఓ.డి.ఎఫ్. కార్యక్రమంపై అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, మన జిల్లాను బహిరంగ మల విసర్జన రహిత జిల్లా ప్రకటించడం జరిగిందని, క్షేత్ర స్థాయిలో పూర్తి శాతం టాయ్ లెట్లు నిర్మాణాలు జరుగలేదని చెప్పారు. అధికారులు నిర్మాణం కాని టాయ్ లెట్ల లబ్దిదారుల వివరాలను సేకరించి వాటిని నిర్మించడానికి చర్యలు చేపట్టాలన్నారు. అదే విధంగా నిర్మించిన టాయ్ లెట్లన్నీ వినియోగంలోకి రావాలన్నారు. జిల్లా స్ధాయిలోను, మండల స్థాయిలోను, గ్రామ స్థాయిలోను అవగాహనా కార్యక్రమాలను నిర్వహించాలని తెలిపారు. ఫాంప్లెట్స్, వీడియోలు, గోడపత్రికలు వంటి మెటీరియల్ ను తయారు చేయాలని తెలిపారు. నూతనంగా ఏర్పాటయిన ఇంజనీరింగ్, సంక్షేమ గ్రామ సచివాలయ సిబ్బందిని వినియోగించుకోవాలని తెలిపారు. పంచాయితీ సెక్రటరీలు, మహిళా పోలీసులు, గ్రామ వాలంటీర్లను కార్యక్రమంలో భాగస్వామ్యం చేయాలని తెలిపారు. బహిరంగ మల విసర్జన వలన వాటిల్లే వ్యాధులు, అనారోగ్యకర సమస్యలపై పాఠశాలలలో విద్యార్ధి దశ నుండి అవగాహన కలిగించాలని తెలిపారు. టాయ్ లెట్లు వున్న ఇంటికి ప్రత్యేక గౌరవం కలిగే విధంగా ఆత్మ గౌరవ స్టిక్కర్లను అంటించాలని, తద్వారా మిగిలిన వారంతా టాయ్ లెట్లు కట్టుకోవడానికి స్ఫూర్తి కలుగుతుందని చెప్పారు. గ్రీన్ అంబాసిడర్ లను నియమించాలని తెలిపారు. విద్యార్ధులకు పూర్తి అవగాహన కలిగడం ద్వారా వారి తల్లితండ్రులలో మంచి మార్పు వస్తుందన్నారు. విద్యార్ధులను గ్రూపులుగా ఏర్పాటు చేయాలని, వారికి విజిల్స్, బేడ్జులు, అందించాలని తెలిపారు. నిర్మించిన టాయ్ లెట్లు వినియోగించుకోకపోవడానికి గల కారణాలను విశ్లేషించాలని, వారి మనోభావాలలో మార్పు తేవాలని, నీటి సమస్య వున్న చోట నీటి కొరతను తీర్చడానికి చర్యలు చేపట్టాలని అన్నారు. విద్యార్ధులు, స్వయంశక్తి సంఘ సభ్యులు, ఆశావర్కర్లు, ఉపాధిహామీ వేతనదారులను కూడా ఇందుకు వినియోగించుకోవాలన్నారు. బహిరంగంగా మూత్రవిసర్జన కూడా జరుగరాదన్నారు. డివిజనల్ పంచాయితీ అధికారులు చెత్త తయారీ కేంద్రాలపై దృష్టి సారించాలన్నారు. రాత్రి పూట బహిరంగ మల విసర్జన వలన పాము కాటు వలన మరణాలు సంభవిస్తున్నాయన్నారు. అన్ని హాస్టళ్ళలోను టాయ్ లెట్లు వుండాలని వాటిని పరిశుభ్రంగా నిర్వహించాలని తెలిపారు. ఐ.సి.డి.ఎస్, మెప్మా, విద్యాశాఖ, వైద్య, ఆరోగ్య శాఖ తదితర శాఖాధికారులంతా సమావేశాలను నిర్వహించాలన్నారు. క్షేత్రస్థాయిలోని సమస్యలను తెలుసుకుని పరిష్కరించడం ద్వారా పూర్తి స్థాయిలో ఓ.డి.ఎఫ్. కార్యక్రమం విజయవంతమౌతుందని తెలిపారు.
శతశాతం మరగుదొడ్లు వినియోగంలోకి రావాలి : జిల్లా కలెక్టర్ జె.నివాస్