శ్రీకాకుళం : ఫిబ్రవరి 13 : పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ది శాఖల ద్వారా చేపడుతున్న అభివృద్ది పనులను మార్చి నెలాఖరులోగా పూర్తిచేసి నిర్ధేశించిన లక్ష్యాలను చేరుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జిల్లా కలెక్టర్లు, అధికారులను కోరారు. గురువారం పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖల పనితీరుపై జిల్లా కలెక్టర్లు, సంబంధిత అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇళ్ల స్థలాలు, నాడు-నేడు, వ్యక్తిగత మరుగుదొడ్లు, సి.సి. రోడ్లు నిర్మాణం, గ్రామ సచివాలయాల ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రానున్న ఆరు వారాలలో ప్రతీ వారం చేపట్టవలసిన పనులపై ముందస్తు ప్రణాళికను తయారు చేసుకొని నిర్ధేశించిన లక్ష్యాలను శతశాతం పూర్తిచేయాలని ఆయన అధికారులను కోరారు.పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది మాట్లాడుతూ జిల్లాల్లో చేపట్టిన పనులకు నిధుల సమస్యలేదని, సరఫరాదారులకు, నిర్మాణదారులకు భరోసా కల్పించి పనులు త్వరితగతిన చేపట్టాలని అధికారులను ఆదేశించారు. గృహనిర్మాణం, పాఠశాలలకు ప్రహరీగోడల నిర్మాణపు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారు. జిల్లాలో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణ ప్రగతి తక్కువగా ఉందని, కావున వాటిని వెంటనే పూర్తిచేయాలని గ్రామీణ నీటిసరఫరా మరియు పారిశుద్ధ్య విభాగం అధికారులను ఆదేశించారు. శాలిడ్ వేస్ట్ మేనేజ్ మెంట్ పట్టణాల్లోనే కొనసాగుతుందని, ప్రతి గడప నుండి చెత్త సేకరించే ప్రక్రియను గ్రామీణ స్థాయికి విస్తరించాలని తెలిపారు. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంటు నిర్వహణలో సంస్థలు అందుబాటులో గల అన్ని అవకాశాలను వినియోగించుకోవాలని పంచాయతీ అధికారులకు తెలిపారు. పంచాయతీరాజ్ కమీషనరు గిరిజాశంకర్ మాట్లాడుతూ పింఛన్ల సర్వేలో 300 యూనిట్ల వినియోగం గల కరెంటు బిల్లులు ప్రాతిపదికగా తీసుకుంటే అర్హులైన కొంతమంది పింఛన్లు కోల్పోయారని వార్తలు వచ్చాయన్నారు. దీనిపై రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించి తగు ఆదేశాలిచ్చారని అన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఇంటిలో చిన్నతరహా పనులు చేసుకుంటున్న లబ్దిదారులు, చేనేత కార్మికులు, రజకులు ఇంటివద్ద పనిచేసుకునేందుకు కరెంటు వినియోగించుచున్నారని అటువంటి వారిని గుర్తించి వారు గృహ నివియోగం కేటగిరీలోనే వేరొక మీటరు తీసుకొనేలా ప్రోత్సహంచి వారికి లబ్ధిచేకూరేలా చూడాలని పేర్కొన్నారు. అర్హులైన పేదవారు ఎవరూ ప్రభుత్వ పథకాలకు దూరం కాకుండా చూడాలనే ముఖ్యమంత్రి ఆశయం నెరవేర్చాలని తెలిపారు. మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికల రిజర్వేషన్లు పూర్తి చేయాలని, మండలం ప్రాతిపధికగా పరిగణనలోనికి తీసుకోవాలని తెలిపారు. ఆదివారం నాటికి వివరాలు అందజేస్తే గెజిట్ నోటిఫికేషను విడుదల చేయవలసి ఉంటుందన్నారు. సోమవారం ఎన్నికల నోటిఫికేషను విడుదల చేసే అవకాశం ఉందని ఆయన అన్నారు. జిల్లా కలెక్టరు జె.నివాస్ జిల్లాలో చేపట్టిన పనుల ప్రగతిని గురించి రాష్ట్ర మంత్రికి మరియు ప్రిన్సిపాల్ సెక్రటరీకి వివరించారు. ప్రభుత్వం నిర్ధేశించిన లక్ష్యాలను సకాలంలో పూర్తిచేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ముఖ్యకార్యనిర్వహణ అధికారి జి.చక్రధరరావు, జిల్లా నీటియాజమాన్య సంస్థ పథక సంచాలకులు హెచ్.కూర్మారావు, గ్రామీణ నీటిసరఫరా విభాగం పర్యవేక్షక ఇంజినీర్ టి.శ్రీనివాసరావు, జిల్లా పంచాయతీ అధికారి వి.రవికుమార్, ఇతర జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధి పనులను మార్చి లోగా పూర్తి చేయాలి : మంత్రి పెద్దిరెడ్డి