ఇండియన్ ఆర్మీలో ఉద్యోగం.. ఎందరో యువతీ యువకుల కల. దేశానికి సేవ చేసే అవకాశం, ఆకర్షణీయమైన జీతభత్యాలు ఈ కొలువుతోనే సాధ్యం. రెండు రకాల ఎంట్రీ పోస్టుల భర్తీ కోసం డిగ్రీ, ఇంజినీరింగ్ అర్హత ఉన్నవారికి భారతీయ సైన్యం తాజాగా ఆహ్వానం పలుకుతోంది. ఎంపికైనవారికి స్టైపెండ్తో శిక్షణ, డిప్లొమా పట్టా.ఆపై ఉద్యోగం! ఆసక్తి ఉన్నవారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుని, ఎంపిక పరీక్షలకు సిద్ధం కావాలి.
ఇండియన్ ఆర్మీ షార్ట్ సర్వీస్ కమిషన్ విధానంలో టెక్ ఎంట్రీ, ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ పోస్టులకు వేర్వేరుగా ప్రకటనలు వెలువరించింది.మహిళలు సహా అవివాహిత గ్రాడ్యుయేట్లు వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్వ్యూల్లో చూపిన ప్రతిభతో శిక్షణలోకి తీసుకుంటారు. విజయవంతంగా ట్రెయినింగ్ పూర్తిచేసుకున్నవారిని లెఫ్టినెంట్ హోదాతో విధుల్లోకి తీసుకుంటారు. ఆకర్షణీయ వేతనాలు, ప్రోత్సాహకాలు అందిస్తారు.
ఎంపిక విధానం ఇలా......
ఈ రెండు పోస్టులకు విడిగా దరఖాస్తు చేసుకోవాలి. వచ్చిన దరఖాస్తులను వారి మార్కుల ఆధారంగా షార్ట్ లిస్టు చేస్తారు. ఇలా వడపోతలో నిలిచినవారికి సెలక్షన్ కేంద్రాల్లో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. దక్షిణ భారతంలో ఉండేవారికి బెంగళూరులో ముఖాముఖి ఉంటుంది. సైకాలజిస్ట్, గ్రూప్ టెస్టింగ్ ఆఫీసర్, ఇంటర్వ్యూ ఆఫీసర్ ఆధ్వర్యంలో ఇవి జరుగుతాయి. రెండు దశల్లో అయిదు రోజుల పాటు కొనసాగుతాయి. తొలిరోజు స్టేజ్-1లో ఉత్తీర్ణులు మాత్రమే తర్వాతి 4 రోజులు నిర్వహించే స్టేజ్-2 ఇంటర్వ్యూలో కొనసాగుతారు. విజయవంతమైనవారికి వైద్య పరీక్షలు నిర్వహించి, శిక్షణలోకి తీసుకుంటారు.
శిక్షణ..వేతనాలు
ఈ రెండింటిలో ఏ పోస్టుకు ఎంపికైనప్పటికీ ఆఫీసర్స్ ట్రెయినింగ్ అకాడమీ చెన్నైలో అక్టోబరు నుంచి శిక్షణ మొదలవుతుంది. దీని వ్యవధి 49 వారాలు. ఈ సమయంలో వీరికి నెలకు రూ.56,100 స్టైఫండ్ చెల్లిస్తారు. విజయవంతంగా శిక్షణ పూర్తిచేసుకున్న వారికి పోస్టుగ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ డిఫెన్స్ మేనేజ్మెంట్ అండ్ స్ట్రాటజిక్ స్టడీస్ డిగ్రీని మద్రాస్ యూనివర్సిటీ ప్రదానం చేస్తుంది. వీరిని లెఫ్టినెంట్ హోదాతో విధుల్లోకి తీసుకుంటారు. పదేళ్లపాటు ఉద్యోగంలో కొనసాగవచ్చు. అనంతరం సంస్థ అవసరాలు, అభ్యర్థుల ఆసక్తుల ప్రకారం కొందరిని పర్మనెంట్ కమిషన్లోకి (శాశ్వత ఉద్యోగం) తీసుకుంటారు. మిగిలినవారికి మరో నాలుగేళ్లపాటు సర్వీస్ పొడిగిస్తారు. అనంతరం వైదొలగాల్సి ఉంటుంది. లెఫ్టినెంట్గా విధుల్లో చేరినవారు రెండేళ్ల అనుభవంతో కెప్టెన్, ఆరేళ్ల అనుభవంతో మేజర్, 13 ఏళ్ల సేవలతో లెఫ్టినెంట్ కల్నల్ హోదాలకు చేరుకోవచ్చు. విధుల్లో చేరినవారికి రూ.56,100 మూలవేతనంతోపాటు మిలట్రీ సర్వీస్ పే, డీఏ, హెచ్ఆర్ఏ, ఇతర అలవెన్సులు అందుతాయి. తొలి నెల నుంచే రూ.లక్షకు పైగా వేతనంగా అందుకోవచ్చు. పలు ప్రోత్సాహకాలూ పొందవచ్చు.ఎస్ఎస్సీ టెక్ మెన్, ఉమెన్
ఖాళీలు: మొత్తం 191. వీటిలో పురుషులకు 175, మహిళలకు 14, ఆర్మీ విడోలకు 2 కేటాయించారు.
విద్యార్హత: సంబంధిత విభాగాల్లో ఇంజినీరింగ్ ఉత్తీర్ణులు, ప్రస్తుతం ఆఖరు సంవత్సరం కోర్సుల్లో ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయసు: అక్టోబరు 1, 2020 నాటికి 20 నుంచి 27 ఏళ్లలోపు ఉండాలి. అక్టోబరు 2, 1993 - అక్టోబరు 1, 2000లోగా జన్మించినవారు అర్హులు. ఆర్మీ విడోల గరిష్ఠ వయసు 35 ఏళ్లకు మించకూడదు.
ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ
ఖాళీలు: 55. వీటిలో 50 పురుషులకు, 5 మహిళలకు కేటాయించారు. ఈ రెండు విభాగాల్లోనూ 6 పోస్టులు యుద్ధంలో మరణించిన/ ప్రమాదానికి గురైన ఆర్మీ ఉద్యోగుల పిల్లలకు దక్కుతాయి.
అర్హత: కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. ప్రస్తుతం ఆఖరు సంవత్సరం కోర్సులు చదువుతున్నవారూ దరఖాస్తు చేసుకోవచ్చు. మూడు విద్యా సంవత్సరాలు ఎన్సీసీ సీనియర్ డివిజన్ వింగ్లో కొనసాగి ఉండాలి. ఎన్సీసీ సీ సర్టిఫికెట్లో కనీసం బీ- గ్రేడ్ పొంది ఉండాలి. యుద్ధంలో మరణించిన ఆర్మీ ఉద్యోగుల పిల్లలకు ఎన్సీసీ సీ సర్టిఫికెట్ అవసరం లేదు.
వయసు: జులై 1, 2020 నాటికి 19 నుంచి 25 ఏళ్లలోపు ఉండాలి. జులై 2, 1995 కంటే ముందు; జులై 1, 2001 తర్వాత జన్మించినవారు అనర్హులు.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ: ఫిబ్రవరి 6. టెక్ ఎంట్రీ: ఫిబ్రవరి 20 http://www.joinindianarmy.nic.in