నేటి నుంచి రాష్ట్రంలో " లాక్ డౌన్" సడలింపులు ఇవే.

అమరావతి : నిత్యావసరాలు, వ్యవ సాయం, నిర్మాణాలకు అనుమతి
పలు పరిశ్రమలు, ఉపాధి హామీ పనులకూ పచ్చజెండా రెడ్‌జోన్‌లలో కఠినంగానే అమలుకు నిర్ణయం 28 రోజులు కొత్త కేసులు రాకుంటే రెడ్‌ నుంచి గ్రీన్‌ జోన్‌కు తెలంగాణలో మే 7 దాకా సడలింపుల్లేకుండా లాక్‌డౌన్‌.ఇక మన రాష్ట్రంలో సోమవారం నుంచి లాక్‌డౌన్‌కు పాక్షిక మినహాయింపులు అమల్లోకి రానున్నాయి. గతం నుంచే వ్యవసాయం, నిత్యావసరాలకు మినహాయింపు ఉండగా. ఇప్పుడు ఆ జాబితాను మరింత పెంచారు. అయితే రెడ్‌జోన్‌ ఉన్న మండలాలు, నగరాలు, పట్టణాల్లో మాత్రం లాక్‌డౌన్‌ కఠినంగా అమల్లో ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని మండలాలతో పాటు నగరాలు, పట్టణాలను రెడ్‌జోన్‌, ఆరెంజ్‌ జోన్‌, గ్రీన్‌ జోన్‌లుగా విభజించింది.
రెడ్‌జోన్‌లుగా ఉన్న మండలాలే కాకుండా, ఆ పక్కనున్న మండలాలు కూడా రెడ్‌జోన్‌లో ఉన్నట్లే పరిగణిస్తారు. అదేవిధంగా కట్టడి ప్రాంతంగా ప్రకటించిన ప్రాంతం నుంచి గ్రామీణ ప్రాంతాల్లో 7కి.మీ., పట్టణ ప్రాంతాల్లో 5కి. మీ. బఫర్‌జోన్‌గా నిర్ణయించారు. ఈ జోన్‌లో మినహాయింపులు వర్తించవు. రెడ్‌జోన్‌ కింద ఉన్న ప్రాంతాల్లో 14రోజుల పాటు కొత్త కేసులు రాకుంటే ఆరెంజ్‌ జోన్‌కు మారుస్తారు. మరో 14రోజులు కొత్త కేసులు రాకుంటే గ్రీన్‌ జోన్‌కు మారుస్తారు. గ్రీన్‌ జోన్‌ ఉన్న ప్రాంతాల్లోనే లాక్‌డౌన్‌కు పాక్షిక మినహాయింపులు ఇచ్చారు. గ్రీన్‌ మండలాల్లో రహదారుల పనులకు అనుమతిస్తూ ఉత్తర్వులిచ్చారు.
వ్యవసాయ రంగం: అన్ని వ్యవసాయ సంబంధ కార్యకలాపాలు చేసుకోవచ్చు. విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల ఉత్పత్తి, విక్రయాలు చేసుకోవచ్చు. వ్యవసాయ పనిముట్ల తయారీ, మరమ్మతులకు సంబంధించిన పరిశ్రమలు, వ్యవసాయ మార్కెట్లు, శీతల గిడ్డంగులు, పండ్లు, కూరగాయల సంబంధిత మండీలు పనిచేస్తాయి. పండ్లు, కూరగాయల బండ్లు నిర్వహించుకోవచ్చు.
మత్స్య, పాడి పరిశ్రమ: చేపల ఉత్పత్తి, చేపల విక్రయం సంబంధిత విక్రయాలకు అనుమతి. పాల సేకరణ, విక్రయాలు, కోళ్ల పరిశ్రమ, దాణా, అమ్మకాలు, గోశాల నిర్వహణ కార్యకలాపాలు కొనసాగుతాయి.
వైద్య సదుపాయాలు: అన్ని ఆసుపత్రులు, క్లినిక్‌లు, నర్సింగ్‌హోమ్‌లు, లేబరేటరీలు పనిచేసుకోవచ్చు. అన్ని పశువుల ఆస్పత్రులు సేవలందించవచ్చు.
ఉపాధి హామీపథకం, ప్రాజెక్టులు: ఉపాధి హామీ పథకం పనులు పూర్తి స్థాయిలో నిర్వహిస్తారు. సాగునీటి ప్రాజెక్టులు, రోడ్లు, భవనాలు, పారిశ్రామిక ప్రాజెక్టులు, పునరుత్పాదక ఇంధన రంగంలోని ప్రాజెక్టులకు అనుమతి. ఎలక్ర్టీషియన్లు, ప్లంబర్లు, ఐటీ రిపేర్లు, కార్పెంటర్లు పనులు చేసుకోవచ్చు.
ఆర్థిక రంగం: బ్యాంకింగ్‌, పోస్టల్‌, మీ-సేవా కేంద్రాలు పనిచే స్తాయి. నగదు కాకుండా ఇతర వస్తువుల కొరియర్‌ కార్యక్రమాలు జాగ్రత్తగా నిర్వహించాలి.
రవాణా రంగం: లారీలు, ట్రక్కులకు సంబంధించిన మరమ్మతు దుకాణాలు పనిచేయవచ్చు. హైవే దాబాలకు అనుమతి. అక్కడ తినడం కాకుండా పార్శిల్‌ మాత్రమే ఇవ్వాలి. ద్విచక్ర వాహనంపై ఒకరికి, కార్లలో ఇద్దరికి అనుమతి. పండ్లు, కూరగాయలు, పాలు, నిత్యావసరాలు, వ్యాపార వస్తువుల రవాణాకు అనుమతి.
పరిశ్రమలు: గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న అన్ని పరిశ్రమలు నిర్వహించవచ్చు. పట్టణ ప్రాంతాల్లో పరిమిత సంఖ్యకు లోబడి తగు జాగ్రత్తలతో రవాణా, నిర్వహణ ద్వారా నిర్వహించవచ్చు. ఇటుక బట్టీల నిర్వహణకు అనుమతి. ధాన్యం, పప్పుల మిల్లులు, పిండి మిల్లులు, పాల ఉత్పత్తులు, వాటర్‌ ప్లాంట్‌లు, ఫ్రూట్‌జ్యూస్‌, బిస్కట్లు, పంచదార లాంటి ఆహార వస్తువులు, బల్క్‌ డ్రగ్స్‌, వైద్య పరికరాల తయారీ, మందుల తయారీ, లిక్విడ్‌సబ్బులు, డిటర్జెంట్లు, ఫినాయిల్‌, ఫ్లోర్‌ క్లీనర్స్‌, బ్లీచింగ్‌ పౌడర్‌, మాస్కులు, బాడీ సూట్‌లు, నేప్‌కిన్స్‌, డైపర్లు, ఆక్సిజన్‌ సిలిండర్లు, శీతల గిడ్డంగులు, మిర్చి, పసుపు, ఉప్పు, సుగంధ ద్రవ్యాల్లాంటి పరిశ్రమలు, బేకరీలు, ఐస్‌ ప్లాంట్‌లు, చేపలు, కోళ్ల, పశువుల దాణా, అన్ని రకాల విద్యుత్‌ ఉత్పత్తి, ఈ-కామర్స్‌ సంస్థల కార్యకలాపాలు, పోర్టులు, విమానాశ్రయాల వద్ద ఉన్న గిడ్డంగులు, రవాణా, కొవిడ్‌ కిట్ల తయారీరంగ పరిశ్రమలకు మినహాయింపు ఇచ్చారు.
నిత్యావసరాలు: అన్ని కిరాణాషాపులు, మందుల షాపులు, పాల కేంద్రాలు, కూరగాయల దుకాణాలు, మాంసం దుకాణాలకు అనుమతి.